ట్రిగ్గర్‌పై మా వేలు రెడీగా ఉంది.. అమెరికాను హెచ్చరించిన ఇరాన్ సైన్యం

  • మధ్యప్రాచ్యం వైపు భారీ యుద్ధ నౌకలను పంపుతున్న అమెరికా
  • దాడి చేస్తే సంపూర్ణ యుద్ధమేనని అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
  • ఎలాంటి దాడినైనా తీవ్రంగా తిప్పికొడతామని స్పష్టీకరణ
  • ఇరాన్‌లో నిరసనల అణచివేత నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. మధ్యప్రాచ్యం వైపు భారీస్థాయిలో యుద్ధ నౌకలను పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా దాన్ని "సంపూర్ణ యుద్ధం"గా పరిగణించి, అత్యంత కఠినంగా బదులిస్తామని హెచ్చరించింది.

‘రాయిటర్స్’ కథనం ప్రకారం ఒక సీనియర్ ఇరాన్ అధికారి మాట్లాడుతూ.. "ఈసారి మాపై ఎలాంటి దాడి జరిగినా, అది పరిమితమైనా, అపరిమితమైనా, సర్జికల్ అయినా.. దాన్ని మేం సంపూర్ణ యుద్ధంగానే పరిగణిస్తాం. దీన్ని పరిష్కరించడానికి మేం అత్యంత కఠినంగా స్పందిస్తాం" అని స్పష్టం చేశారు. అమెరికా సైనిక చర్యల ముప్పు పొంచి ఉన్నందున, తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించి తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేస్తున్న క్రమంలో 5,000 మందికి పైగా మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ విమానవాహక నౌక, తొమాహాక్ క్షిపణులతో కూడిన మూడు డిస్ట్రాయర్లు, డజను F-15E ఫైటర్ జెట్లు ఇప్పటికే మధ్యప్రాచ్యం వైపు కదులుతున్నాయి.

మరోవైపు, ఇరాన్ సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ కూడా అమెరికా, ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. "ట్రిగ్గర్‌పై మా వేలు ఉంది, మేం గతంలో కంటే ఇప్పుడు మరింత సిద్ధంగా ఉన్నాం" అని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇరాన్‌లో అంతా అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి దుస్సాహసానికైనా సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు.


More Telugu News