బలవంతంగా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయవద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు

  • వాహనం లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదన్న హైకోర్టు
  • వాహనదారుడు చెల్లిస్తేనే చలానా మొత్తం తీసుకోవాలన్న హైకోర్టు
  • వాహనదారుడికి చెల్లించడం ఇష్టంలేకపోతే నోటీసులు జారీ చేయాలన్న హైకోర్టు
తెలంగాణ హైకోర్టు వాహనాల పెండింగ్ చలాన్‌లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్‌ల విషయంలో వాహనదారులను బలవంత పెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్‌ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

చలాన్‌లు చెల్లించాలని వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనాన్ని ఆపడం వంటి చర్యలకు పాల్పడవద్దని ట్రాఫిక్ పోలీసులకు సూచించింది. వాహనం ఆపినప్పుడు వాహనదారు స్వచ్ఛందంగా చలాన్‌లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేయవచ్చని పేర్కొంది. వాహనదారులు చలానా చెల్లించడానికి ఇష్టపడకుంటే చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.

Telangana High Court
Traffic Challan
Telangana Traffic Police
High Court Orders
Pending Challans

More Telugu News