సెల్ఫీ కోసం వేదికపైకి అభిమాని.. ఫోన్ లాక్కున్న షారూఖ్ ఖాన్

  • రియాద్‌లో జాయ్ అవార్డ్స్ వేడుక
  • వేదికపై సెల్ఫీకి యత్నించిన అభిమానిని వారించిన షారుఖ్
  • ఇది ఈవెంట్ ప్రొటోకాల్‌లో భాగమేనంటూ షారుఖ్‌కు మద్దతు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఓ అవార్డుల కార్యక్రమంలో వేదికపై అభిమాని సెల్ఫీ ప్రయత్నాన్ని సున్నితంగా నివారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, షారుఖ్ కేవలం ఈవెంట్ ప్రొటోకాల్‌ను పాటించారని ఎక్కువమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఇటీవల 'జాయ్ అవార్డ్స్ 2026' కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఓ అవార్డును అందించడానికి షారుఖ్ వేదికపైకి వెళ్లారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఆయనతో సెల్ఫీ దిగేందుకు తన ఫోన్‌ను తీశారు. దీన్ని గమనించిన షారుఖ్ నవ్వుతూనే ఆ వ్యక్తి చేతిలోంచి ఫోన్‌ను తీసుకుని, ఈవెంట్ అధికారిక ఫొటోగ్రాఫర్ల వైపు చూడాలని సైగ చేశారు. కాసేపటి తర్వాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. కొందరు షారుఖ్ తీరును తప్పుబట్టాలని చూసినా, చాలామంది ఆయన చర్యను సమర్థించారు. అధికారిక కార్యక్రమాల్లో వేదికపై వ్యక్తిగత సెల్ఫీల కంటే నిర్వాహకుల ఫొటోగ్రఫీకే ప్రాధాన్యం ఉంటుందని, షారుఖ్ ఆ నిబంధననే గౌరవించారని పలువురు కామెంట్స్ చేశారు. "షారుఖ్ ఈవెంట్ ప్రొటోకాల్‌ను అనుసరించారు. ఆయన తన బాధ్యతను నిర్వర్తించడంలో తప్పులేదు" అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై షారుఖ్ గానీ, ఈవెంట్ నిర్వాహకులు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కేటీ పెర్రీ, మిల్లీ బాబీ బ్రౌన్ వంటి ఇతర అంతర్జాతీయ తారలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.


More Telugu News