మూడు నెలల ముందే మార్కెట్లోకి మామిడి.. ధర మాత్రం అదుర్స్!

  • హైదరాబాద్ మార్కెట్లలోకి ముందుగానే వచ్చిన మామిడి పళ్లు
  • సాధారణ సీజన్‌కు మూడు నెలల ముందే విక్రయాలు
  • బంగినపల్లి కిలో ధర రూ. 200 నుంచి రూ. 300
  • ధర ఎక్కువ ఉన్నా రుచి అంతంతమాత్రమేనంటున్న వినియోగదారులు
  • సాగు విధానాల్లో మార్పులే కారణమంటున్న వ్యాపారులు
మామిడి పళ్ల సీజన్ రావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ, హైదరాబాద్ మార్కెట్లు అప్పుడే మామిడి పళ్లతో కళకళలాడుతున్నాయి. పండ్లలో రారాజు రాక వినియోగదారులకు సంతోషాన్నిస్తున్నా, వాటి ధరలు, రుచి మాత్రం నిరాశపరుస్తున్నాయి. నగరంలోని ఎర్రగడ్డ, మెహిదీపట్నం, ఎంజే మార్కెట్ వంటి ప్రధాన మార్కెట్లలో బంగినపల్లి, బెనిషాన్ రకం మామిడి పళ్లు దర్శనమిస్తున్నాయి.

ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో బంగినపల్లి మామిడి ధర రూ. 200 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. సాధారణంగా సీజన్‌లో కిలో రూ. 50 నుంచి రూ. 60కే లభించే మామిడిని ఇప్పుడు ఇంత ఎక్కువ ధరకు కొనడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ధర అధికంగా ఉండటమే కాకుండా, ఈ పళ్లలో పులుపుదనం ఎక్కువగా ఉండి, ఆశించినంత రుచి లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు.

‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకారం.. హైబ్రిడ్ సాగు పద్ధతులు, వాతావరణ మార్పులు, అకాల వర్షాల కారణంగానే పంట త్వరగా చేతికి వస్తోందని వ్యాపారులు వివరిస్తున్నారు. "ఇప్పుడు పళ్లకు సీజన్‌ అంటూ ఏముంటుంది చెప్పండి? అన్ని సీజన్‌లలోనూ అన్ని పళ్లూ కనబడుతున్నాయి, మామిడి కూడా అంతే," అని ఎర్రగడ్డ రైతు బజార్‌కు చెందిన సలీం అనే వ్యాపారి వ్యాఖ్యానించారు. గత మూడేళ్లుగా సంక్రాంతి సమయానికే మామిడి పళ్లు మార్కెట్‌కు వస్తున్నాయని మరో వ్యాపారి తెలిపారు.

మొత్తంమీద, సీజన్‌కు ముందే మామిడి పళ్లు అందుబాటులోకి వచ్చినా, అధిక ధరలు, రుచి లేకపోవడం వల్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్పష్టమవుతోంది.


More Telugu News