బాంబు బెదిరింపు... ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో కలకలం
  • ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా వెళుతుండగా లక్నోకు మళ్లింపు
  • విమానం టాయిలెట్‌లో టిష్యూ పేపర్‌పై బెదిరింపు నోట్
  • ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడి
  • బాంబ్ స్క్వాడ్‌తో విమానంలో విస్తృత తనిఖీలు
ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపుతో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ నుంచి బెంగాల్ లోని బాగ్డోగ్రా వెళుతున్న విమానాన్ని అత్యవసరంగా లక్నోకు మళ్లించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 238 మంది ఉన్నారు.

వివరాల్లోకి వెళితే, ఇండిగో విమానం 6E-6650 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాగ్డోగ్రాకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా, టాయిలెట్‌లోని ఒక టిష్యూ పేపర్‌పై బాంబు ఉన్నట్లు చేతితో రాసిన బెదిరింపు నోట్‌ను సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని ఉదయం 8:46 గంటలకు అప్రమత్తం చేశారు. అధికారుల సూచన మేరకు విమానాన్ని సమీపంలోని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు.

ఉదయం 9:17 గంటలకు విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బేకు తరలించి ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. సమాచారం అందుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రయాణికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది. ప్రయాణికులకు తాత్కాలికంగా అసౌకర్యం కలగకుండా ఆహారం, ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ప్రతినిధి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News