మేడారం వెళ్లే భక్తులకు గమనిక

  • మేడారంలో నేడు, రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • మేడారంలో భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన పోలీసులు
  • రేపు పునర్నిర్మాణం పూర్తయిన వనదేవతల గద్దెలను ప్రారంభించనున్న సీఎం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతరకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మొక్కులు తీర్చుకుంటే వరాలిచ్చే వనదేవతలు సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికే మేడారం బాట పట్టారు. జాతర ప్రారంభానికి ముందే ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కిటకిటలాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం, సోమవారాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. ఆదివారం మేడారంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం పునర్నిర్మాణం పూర్తయిన వనదేవతల గద్దెలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భక్తుల సౌకర్యం, భద్రత కోసం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ములుగు – పస్రా - నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలని సూచించారు. తాడ్వాయి మార్గంలో వాహనాలకు (నో ఎంట్రీ) ఆంక్షలు విధించారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట-భూపాలపల్లి-పరకాల-గుండెప్పాడు మీదుగా వరంగల్‌కు చేరుకోవాలని అధికారులు తెలిపారు. 


More Telugu News