బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు దారుణ హత్య

  • పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండానే వెళ్లే ప్రయత్నం చేసిన నిందితుడు
  • కారును ఆపే ప్రయత్నం చేసిన హిందూ ఉద్యోగి రిపోన్ సాహా
  • కారుతో ఢీకొట్టి హత్య చేసిన బీఎన్‌పీ మాజీ నాయకుడు
బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. గత మూడు వారాల్లోనే బంగ్లాదేశ్‌లో పది మందికి పైగా హిందువులు హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా, పెట్రోల్ పంపులో ఇంధనం నింపుకుని డబ్బులు చెల్లించకుండానే వెళ్లిపోతున్న వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు హిందూ వ్యక్తిని వాహనంతో ఢీకొట్టి హతమార్చారు. ఈ విషాద సంఘటన రాజ్‌బరి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని 30 ఏళ్ల రిపోన్ సాహాగా గుర్తించారు. అతడు అక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

రాజ్‌బరిలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో రిపోన్ సాహా ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) రాజ్‌బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ పెట్రోల్ నింపుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండానే వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో రిపోన్ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, హషేమ్ తన కారును అతనిపైకి పోనిచ్చాడు. తీవ్ర గాయాలపాలైన రిపోన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హషేమ్, అతడి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. 


More Telugu News