అమలాపురంలో 'టెస్లా సైబర్ ట్రక్'... జనాల చూపంతా దానిపైనే!

  • అమలాపురం రోడ్లపై టెస్లా సైబర్ ట్రక్ సందడి
  • సంక్రాంతి వేడుకల కోసం తీసుకొచ్చిన పారిశ్రామికవేత్త ఆదిత్య రామ్
  • అరుదైన కారును చూసేందుకు ఎగబడిన స్థానిక ప్రజలు
  • సెల్ఫీలతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వాహనం
కోనసీమ జిల్లా అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ సందడి చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ అరుదైన ఎలక్ట్రిక్ వాహనం పట్టణ వీధుల్లో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. దీనిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య రామ్ గ్రూప్ ఛైర్మన్ ఆదిత్య రామ్ ఈ వాహనాన్ని అమలాపురానికి తీసుకొచ్చారు. "అమలాపురం అల్లుడు"గా పేరున్న ఆయన, ప్రతి ఏటా సంక్రాంతికి తన అత్తవారింటికి రావడం ఆనవాయతీ. గతేడాది రోల్స్ రాయిస్ కారులో వచ్చిన ఆయన, ఈసారి సైబర్ ట్రక్‌లో వచ్చారు.

టెస్లా కంపెనీ సైబర్ ట్రక్‌ను భారత్‌లో అధికారికంగా విక్రయించడం లేదు. దేశంలో కేవలం టెస్లా 'మోడల్ వై' మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఆదిత్య రామ్ ఈ వాహనాన్ని ప్రైవేటుగా దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. దిగుమతి సుంకాలు, పన్నులతో కలిపి దీని విలువ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

అత్యాధునిక డిజైన్‌తో ఉన్న ఈ కారును చూసిన జనం సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ఈ వాహనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమలాపురం వీధులన్నీ పండుగ సందడితో పాటు సైబర్ ట్రక్ హడావుడితో నిండిపోయాయి.


More Telugu News