రోశయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు

  • మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అర్ధాంగి శివలక్ష్మి కన్నుమూత
  • వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస
  • రోశయ్య కుమారుడు శివకుమార్‌కు ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు
  • రోశయ్య కుటుంబంతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, దివంగత నేత కొణిజేటి రోశయ్య ఇంట విషాదం నెలకొంది. ఆయన అర్ధాంగి శివలక్ష్మి (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో ఉంటున్న శివలక్ష్మి, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే జనవరి 12న తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మరణవార్త తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీలకు అతీతంగా నాయకులు వారి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

ఈ నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబు, రోశయ్య కుమారుడు శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శివలక్ష్మి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబంతో తనకు దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వారిని ఓదార్చారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన శివలక్ష్మి... రోశయ్య రాజకీయ జీవితంలో వెన్నంటి నిలిచారు. రోశయ్య 2021 డిసెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. కాగా, మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్‌లోని సొంత ఫామ్‌హౌస్‌లో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు.


More Telugu News