సంక్రాంతి ప్రయాణం: ఏపీ బస్సులు తగ్గె.. టీజీఎస్ ఆర్టీసీ సర్వీసులు పెరిగె!

  • ఏపీలో ‘స్త్రీ శక్తి’ పథకం ఎఫెక్ట్
  • తెలంగాణ నుంచి తగ్గిన ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
  • 6,431 స్పెషల్ బస్సులను నడుపుతున్న టీజీఎస్ ఆర్టీసీ
  • కొనసాగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ
  • విశాఖకు రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్న వైనం
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి రవాణాలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి) అమలులో ఉండటంతో, అక్కడ స్థానికంగా రద్దీ పెరిగింది. దీనివల్ల ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ నుంచి నడిపే ప్రత్యేక బస్సుల సంఖ్యను భారీగా తగ్గించింది.

గత ఏడాది తెలంగాణ నుంచి 2,000 ప్రత్యేక బస్సులను నడిపిన ఏపీఎస్‌ఆర్టీసీ, ఈసారి కేవలం 200 సర్వీసులకే పరిమితమైంది. దీంతో ఆంధ్రకు వెళ్లే ప్రయాణికుల భారం టీజీఎస్ ఆర్టీసీపై పడింది. ఈ రద్దీని తట్టుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. పండుగకు వెళ్లేవారితో పాటు, తిరిగి వచ్చే వారి కోసం జనవరి 18, 19 తేదీల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, ఈ స్పెషల్ బస్సులకు సాధారణ చార్జీల కంటే 1.5 శాతం అదనపు చార్జీలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను అమాంతం పెంచేశాయి. ప్రభుత్వ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు సుమారు రూ. 1,500 చార్జీ ఉండగా, ప్రైవేటు సంస్థలు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ దోపిడీపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రయాణికులు బస్సుల వివరాలు, ఇతర సమాచారం కోసం టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించవచ్చు.


More Telugu News