ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై తమిళనాడు బీజేపీ నేత కే. అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, థాకరేల బెదిరింపులు తనను ముంబై రాకుండా అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఇటీవల ముంబైలో శివసేన-ఎంఎన్ఎస్ ర్యాలీలో అన్నామలైని హేళన చేస్తూ, "తమిళనాడు నుంచి ఒక రసమలై వచ్చాడు, ఇక్కడికి నీకు సంబంధం ఏమిటి? హటావో లుంగీ బజావో పుంగీ" అని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై స్పందిస్తూ... "నన్ను బెదిరించడానికి ఆదిత్య థాకరే, రాజ్ థాకరే ఎవరు?" అని ప్రశ్నించారు. రైతు కొడుకుగా ఉన్నందుకు గర్విస్తున్నానని, రాజకీయ బెదిరింపులకు భయపడనని ఆయన అన్నారు.


"నేను ముంబైకి వస్తే నా కాళ్లు నరికివేస్తామని కొందరు రాశారు. నేను ముంబైకి వస్తాను. నా కాళ్లు నరికివేయడానికి ప్రయత్నించండి. అలాంటి బెదిరింపులకు నేను భయపడి ఉంటే, నేను నా గ్రామంలోనే ఉండేవాడిని" అని అన్నామలై స్పష్టంగా చెప్పారు. తన వ్యాఖ్యలు మరాఠీల గొప్పతనాన్ని దెబ్బతీశాయని వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, "కామరాజ్ భారతదేశంలో గొప్ప నాయకుడు అని చెబితే, ఆయన తమిళుడు కాకుండా పోతాడా? ముంబై ప్రపంచస్థాయి నగరమని చెబితే, మహారాష్ట్రీయులు దానిని అభివృద్ధి చేయలేదని అర్థమా?" అని ప్రశ్నించారు. ముంబై ప్రతిష్ఠ మరాఠీ ప్రజల సహకారం నుంచి విడదీయరానిదని ఆయన అన్నారు.


తనను విమర్శిస్తున్నవారిని అజ్ఞానులు అని అన్నామలై సంబోధించారు. ధోవతులు, లుంగీలు వంటి వస్త్రధారణను హేళన చేయడాన్ని ప్రశ్నిస్తూ, తమిళులను తక్కువ చేసే శివసేన యూబీటీతో డీఎంకే పార్టీ పొత్తు ఉండటాన్ని విమర్శించారు.


Annamalai
Raj Thackeray
Tamil Nadu BJP
Maharashtra Navnirman Sena
Mumbai
Shiv Sena
MNS Rally
Lungi
Hate Speech
Politics

More Telugu News