జగన్ 'బెంగళూరు ప్యాలెస్‌' కుట్రలపై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ కలిశెట్టి డిమాండ్

  • యలహంక ప్యాలెస్‌లో ఏపీపై కుట్రలకు జగన్ పథక రచన చేస్తున్నారని ఆరోపణ
  • బెంగళూరులో ఏం జరుగుతుందో తేల్చాలని కేంద్రానికి ఎంపీ లేఖ
  • అసెంబ్లీకి రాకుండా దొంగ సంతకాలతో జీతాలు తీసుకుంటున్నారని ధ్వజం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని వెల్లడించారు. ఆదివారం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ తాడేపల్లి ప్యాలెస్ కృష్ణా నది సమీపంలోనే ఉన్నా ఎప్పుడైనా మునిగిందా అని ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్‌రెడ్డిల ఆస్తులు అసాధారణంగా పెరగడంపై దేశంలోని ఇతర ఎంపీలు సైతం ఆశ్చర్యపోతున్నారని అప్పలనాయుడు పేర్కొన్నారు. దోపిడీలు, భూకబ్జాలు, బెదిరింపుల ద్వారానే వారు ఈ సంపద కూడబెట్టారని ఆరోపించారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా కేవలం దొంగ సంతకాలతో జీతభత్యాలు పొందుతున్నారని విమర్శించారు. జగన్ కనీసం తనను గెలిపించిన పులివెందుల ప్రజల సమస్యల కోసమైనా అసెంబ్లీకి రావాలని ఆయన హితవు పలికారు.

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, ఇప్పుడు సీఎం చంద్రబాబు అమరావతిని నిర్మిస్తుంటే దానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అమరావతి అంటే జగన్‌కు ఇష్టమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమరావతి అభివృద్ధిపై ఒక వీడియోను రూపొందించి, బెంగళూరు ప్యాలెస్‌లో ఉన్న జగన్‌కు పంపుతానని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు.


More Telugu News