మన శంకర వరప్రసాద్ గారు చిత్ర ప్రమోషన్స్‌లో నయనతార... కారణమేంటో చెప్పిన అనిల్ రావిపూడి

క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార కథానాయికగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి పలు  ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్‌లో చూపించని ఓ బలమైన ఎమోషనల్ పాయింట్ సినిమాలో ఉందని తెలిపారు. కామెడీతో పాటు భావోద్వేగాలతో నిండిన ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి, నయనతార, పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయని అన్నారు. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంటారనే అంశాన్ని కొత్త కోణంలో చూపించామని వెల్లడించారు.

అలాగే చిత్ర ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొనడంపై స్పందించిన అనిల్ రావిపూడి .. పనిచేసే ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నీషియన్‌కు పూర్తి కంఫర్ట్ ఇస్తానని చెప్పారు. నిజాయతీగా కోరినప్పుడు ఎదుటి వ్యక్తితో భావోద్వేగ అనుబంధం ఏర్పడితే, మొదట చేయనని అనుకున్న వారు కూడా ముందుకు వస్తారని అన్నారు. నయనతార విషయంలో కూడా అదే జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె ఎంతో నిజాయతీగా వ్యవహరిస్తారని, ఒక విషయం నమ్మితే తప్పకుండా చేసి తీరుతారని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

సాధారణంగా తన సినిమాల ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార ఈ చిత్రం కోసం తన రూల్స్ బ్రేక్ చేయడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినీ వర్గాల్లోనూ ఇది హాట్ టాపిక్‌గా ఉండటంతో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. 

Nayanatara
Chiranjeevi
Anil Ravipudi
Mana Shankara Varaprasad Garu
Telugu cinema
Movie promotions
Venkatesh
Sankranthi release
Tollywood
Family drama

More Telugu News