సీబీఐ వలలో సీపీఆర్ఐ జాయింట్ డైరెక్టర్.. రూ.9.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్

  • నిందితుడి నివాసంలో రూ. 3.59 కోట్ల నగదు, భారీగా విదేశీ కరెన్సీ 
  • ప్రైవేటు కంపెనీ ఉత్పత్తులకు అనుకూల నివేదికల కోసం కుమ్మక్కు 
  • జాయింట్ డైరెక్టర్‌తో పాటు ప్రైవేటు సంస్థ డైరెక్టర్ అతుల్ ఖన్నా అరెస్ట్
కేంద్ర విద్యుత్ పరిశోధనా సంస్థ (సీపీఆర్ఐ)లో భారీ అవినీతి తిమింగలం సీబీఐకి చిక్కింది. సీపీఆర్ఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న చెన్ను రాజారామ్ మోహన్‌రావు ఒక ప్రైవేటు సంస్థ నుంచి రూ. 9.50 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న 'సుధీర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్' డైరెక్టర్ అతుల్ ఖన్నాను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.

అరెస్ట్ అనంతరం రాజారామ్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. ఆయన ఇంట్లో కట్టల కొద్దీ ఉన్న రూ. 3.59 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అమెరికన్ డాలర్లు, యూరోలు, యూఏఈ దిర్హామ్‌లు సహా మొత్తం 9 దేశాలకు చెందిన సుమారు రూ. 4.05 లక్షల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు. వీటితో పాటు విలువైన నగలు, కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో మొత్తం రూ. 3.76 కోట్ల విలువైన నగదు, కరెన్సీ లభించినట్లు అధికారులు వెల్లడించారు.

సుధీర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తయారు చేసే విద్యుత్ పరికరాలకు అనుకూలంగా టెస్టింగ్ నివేదికలు ఇచ్చేందుకు రాజారామ్ లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. దీనిపై జనవరి 8న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు, శుక్రవారం వ్యూహాత్మకంగా మాటు వేసి లంచం తీసుకుంటుండగా నిందితులను పట్టుకున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని అత్యున్నత పరిశోధనా సంస్థలో ఇలాంటి అవినీతి జరగడం సంచలనంగా మారింది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. 

Chennu Rajaram Mohan Rao
CPRI
Central Power Research Institute
Sudhir Group of Companies
Atul Khanna
bribery case
corruption
CBI raid
illegal assets
testing reports

More Telugu News