మంత్రి ఆనం అధ్వర్యంలో '108 తెలుగునాడు యూనియన్' ఆవిర్భావం

రాష్ట్రంలోని 108 సర్వీసుల ఉద్యోగులు కొత్తగా 'తెలుగునాడు 108 ఎంప్లాయిస్ యూనియన్' పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ యూనియన్‌కు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. టీఎన్‌టీయూసీ అనుబంధంగా ఈ నూతన సంఘం పనిచేయనుంది.

గత ప్రభుత్వ హయాంలో అరబిందో సంస్థ యాజమాన్యం చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా 108 సిబ్బంది రెండుగా చీలిపోయినట్లు నేతలు తెలిపారు. సీఐటీయూ నుంచి బయటకు వచ్చి ఈ కొత్త యూనియన్‌ను ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది ప్రాణాలు కాపాడుతున్న 108, 104 సిబ్బందికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం సిబ్బందికి రావాల్సిన రాయితీలలో కోతలు పెట్టి యాజమాన్యంతో కుమ్మక్కైందని ఆరోపించారు. సమాజ సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ గొట్టెముక్కల రఘురామరాజు కూడా ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ తాత్కాలిక కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా పూజారి నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోను రత్తయ్య, జనరల్ సెక్రటరీగా జల్లేపల్లి యుగంధర్‌తో పాటు మరో నలుగురితో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

Anam Ramanarayana Reddy
108 services
Telugu Nadu 108 Employees Union
TNTUC
Andhra Pradesh
Aurobindo
Gottemukkala Raghurama Raju
Pujari Nagaraju

More Telugu News