లెక్చరర్లు తిట్టారని మనస్థాపం.. ఇంటర్ విద్యార్థిని మృతి

  • కాలేజీకి ఆలస్యంగా రావడంతో అమ్మాయని దూషించిన లెక్చరర్లు
  • లెక్చరర్ల మాటలకు మానసికంగా కుంగిపోయిన బాలిక 
  • ఇంటికి వెళ్లి స్పృహతప్పి పడిపోయిన బాలిక
  • మెదడులో రక్తం గడ్డ కట్టి నిన్న రాత్రి మృతి
సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. లెక్చరర్లు మందలించడంతో మనస్థాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఎం.ఆర్. బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం కళాశాలకు గంట ఆలస్యంగా రావడంతో ఫిజిక్స్ లెక్చరర్ శ్రీలక్ష్మి, ఇంగ్లీష్ లెక్చరర్ మాధురి ఆమెను అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించారు.

ఆ మాటలకు తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తల్లికి చెప్పింది. లెక్చరర్లతో తర్వాత మాట్లాడదామని తల్లి నచ్చజెప్పింది. ఇంతలో విద్యార్థినికి తలనొప్పి రావడంతో ఇంటి వద్ద స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను మల్కాజ్‌గిరిలోని ఒక ఆసుపత్రికి, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సీటీ స్కాన్ చేసిన వైద్యులు, తీవ్ర మనస్తాపానికి గురికావడం వల్ల మెదడులో రక్తం గడ్డ కట్టిందని నిర్ధారించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయని స్థితికి చేరుకున్నాయి. గురువారం రాత్రి బాలిక మృతి చెందగా, శుక్రవారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. సంబంధిత లెక్చరర్లు, ప్రిన్సిపల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Student Suicide
Secunderabad
West Maredpally
Government Junior College
MR Girls Junior College

More Telugu News