వైభవ్ సూర్యవంశీ విధ్వంసక శతకం.. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ

  • మూడో వన్డేలో చెలరేగిన భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ
  • కేవలం 63 బంతుల్లోనే శతకంతో విధ్వంసం
  • గత మ్యాచ్‌లోనూ 24 బంతుల్లో 68 పరుగులు చేసిన వైభవ్
  • ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
  • క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన యంగ్ ఇండియా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆడుతున్న మూడో, చివరి వన్డేలోనూ దుమ్మురేపుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వైభవ్ కేవలం 63 బంతుల్లోనే విధ్వంసక శతకం బాదాడు.

తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టిన వైభవ్.. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 127 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ కూడా రాణిస్తుండటంతో భారత్ వికెట్ నష్టపోకుండా పటిష్ఠ‌ స్థితిలో ఉంది. గత మ్యాచ్‌లోనూ వైభవ్ ఇదే తరహాలో చెలరేగిన విషయం తెలిసిందే. 

వర్షం కారణంగా కుదించిన ఆ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 24 బంతుల్లో 10 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్లు కూడా రాణించారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కిషన్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా, దక్షిణాఫ్రికా తరఫున జాసన్ రౌల్స్ (114) సెంచరీతో పోరాడాడు.

ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. మూడో మ్యాచ్‌లోనూ సెంచరీతో చెలరేగి, 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా జట్టును నడిపిస్తున్నాడు. 


More Telugu News