ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదం: బీఆర్ఎస్‌తో తెగిన బంధం

MLC Kavitha Resignation Approved Ending Ties With BRS
షార్ట్స్‌లో చూడండి
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి వి. నర్సింహాచార్యులు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, పార్టీ అగ్రనేతలతో విభేదాల నేపథ్యంలో కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు.

పార్టీలోని కీలక నేతలు హరీశ్‌రావు, సంతోష్‌రావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో గత సెప్టెంబరులో బీఆర్ఎస్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ వెంటనే కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం స్వయంగా మండలికి వచ్చిన ఆమె తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. దీంతో బీఆర్ఎస్‌తో ఆమెకు ఉన్న సుదీర్ఘ అనుబంధం అధికారికంగా ముగిసినట్లయింది.

రాజకీయ పరిణామాల తర్వాత కవిత తన దృష్టిని తిరిగి 'తెలంగాణ జాగృతి' వైపు మళ్లించారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా మంగళవారం జాగృతి కార్యవర్గంతో ఆమె విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బడ్జెట్, ఉపాధి, వైద్యం, మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం వంటి విభిన్న రంగాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు.

ఈ అధ్యయన నివేదికలను పరిశీలించేందుకు ఎల్‌.రూప్‌సింగ్ అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఈనెల 17వ తేదీన తమ నివేదికలను అందజేయాలని, ఆ తర్వాతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.
Go Back to Shorts
Kavitha
MLC Kavitha
Kavitha Nizamabad
BRS Party
Telangana Jagruthi
Gutta Sukhender Reddy
Telangana Politics
MLC resignation
Telangana state
Local authorities

More Telugu News