కాశీ ఎక్స్‌ప్రెస్ కు బాంబు బెదిరింపు

  • గోరఖ్‌పూర్ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న రైలుకు బాంబు బెదిరింపు 
  • 'మౌ' స్టేషన్‌లో రైలును నిలిపి తనిఖీలు నిర్వహించిన అధికారులు
  • ఎలాంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదని వెల్లడి
కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. గోరఖ్‌పూర్ నుంచి ముంబైకి వెళుతున్న కాశీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును 'మౌ' రైల్వే స్టేషన్‌లో నిలిపి తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై 'మౌ' రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎలమరన్ మాట్లాడుతూ, కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు వచ్చిందని తెలిపారు. రైలు స్టేషన్‌కు చేరుకున్న వెంటనే ప్రయాణికులందరినీ కిందకు దించి, ప్రతి బోగీలో క్షుణ్ణంగా తనిఖీలు చేశామని చెప్పారు. పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదయం ఫోన్ కాల్ రాగానే 'మౌ' పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌తో కలిసి రైల్వే స్టేషన్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.


More Telugu News