మెగాస్టార్ చిరంజీవికి శస్త్రచికిత్స?... క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

  • చిరంజీవికి సర్జరీ జరిగిందన్న వార్తలను ఖండించిన నిర్మాతలు
  • సోషల్ మీడియా రూమర్లతో ఆందోళన చెందిన అభిమానులు
  • ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతారని తెలిపిన సాహు గారపాటి
  • గతంలో కంటే మరింత ఫిట్‌గా ఉన్నారని వెల్లడి
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల చిన్న శస్త్రచికిత్స జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర నిర్మాతలు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. దీంతో చిరంజీవి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్‌గారు' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, అందుకే ఆయనకు సర్జరీ జరిగిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మీడియా సమావేశంలో ఈ వదంతులను కొట్టిపారేశారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. "చిరంజీవికి సర్జరీ జరిగిందన్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఆయన ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. బుధవారం జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వెంకటేశ్‌తో కలిసి హాజరవుతారు. ప్రమోషన్లు, ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటారు" అని తెలిపారు. చిరంజీవి ఫిట్‌నెస్ గురించి చెబుతూ, "ఆయన గతంలో కంటే ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నారు. అందుకే తెరపై స్పెషల్ లుక్‌లో కనిపిస్తారు. అవుట్‌డోర్ షూటింగ్‌లో కూడా రెండు పూటలా జిమ్ చేసేవారు" అని వివరించారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.


More Telugu News