ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం... ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత్

  • తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దని సూచన
  • నిరసన జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ
  • ఇరాన్‌లోని భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
ఇరాన్ వెళ్లే భారతీయులకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చేవరకు భారతీయ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు, భారత సంతతికి చెందినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీని జారీ చేసింది.

తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వార్తలను, వెబ్‌సైట్‌ను, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు భారత రాయబార కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోని పక్షంలో వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.


More Telugu News