ఆధార్ అప్ డేట్ కు మరో ఛాన్స్.. విశాఖ జిల్లాలో ప్రత్యేక శిబిరాలు

ఆధార్ కార్డ్ అప్ డేట్ తప్పనిసరి అని, ప్రతీ పదేళ్లకు ఒకసారి బయోమెట్రిక్ తో పాటు నివాస ధ్రువీకరణను నవీకరించుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్) పేర్కొంది. ఐదేళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్ చేయకపోతే వారికి జారీ చేసిన బాల ఆధార్ రద్దవుతుందని హెచ్చరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మారింది.

ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు పొందాలన్నా ఆధార్ కావాల్సిందే.. ఈ క్రమంలో ఆధార్ అప్ డేట్ చేయించుకోకపోతే ఈ ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఆధార్ అప్ డేట్ చేస్తున్నారు. ఉడాయ్‌ సూచనల మేరకు విశాఖ జిల్లాలో తప్పనిసరిగా చేయాల్సిన బయోమెట్రిక్‌ 1,09,000 పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్పారు.

దీంతో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ అప్ డేట్, బయోమెట్రిక్ అప్ డేట్ చేస్తున్నట్లు తెలిపారు. పదిహేడేళ్ల లోపు పిల్లలకు ఆధార్ అప్ డేట్ పూర్తిగా ఉచితమని చెప్పారు. గతేడాది అక్టోబర్ లోనూ వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించామని, స్పందన అంతంతమాత్రంగానే ఉండడంతో తాజాగా మరోసారి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Aadhar Card
UIDAI
Aadhar update
Visakhapatnam
Biometric update
Aadhar special camps
AP government schemes
Andhra Pradesh
Child Aadhar
Residence verification

More Telugu News