మా పునాది వల్లే ఈ మైలురాయి: భోగాపురం ఎయిర్ పోర్టుపై జగన్ ట్వీట్

  • భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌పై స్పందించిన జగన్
  • ఇది ఏపీ అభివృద్ధిలో ఒక మైలురాయి అని వ్యాఖ్య
  • మా హయాంలోనే భూసేకరణకు రూ. 960 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
  • వేగవంతమైన అనుమతులతో పనులకు బలమైన పునాది వేశామంటూ ట్వీట్ 
విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయి అని, విజన్ వైజాగ్ లక్ష్య సాధన దిశగా పడిన కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత దశకు చేరుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో వేసిన బలమైన పునాదే కారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ, "మా పాలనా కాలంలో ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అనుమతులు సాధించాం. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రాజెక్టుకు పటిష్ఠమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషే ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకోవడానికి ముఖ్య కారణం" అని వివరించారు.

ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్‌కు జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా, విశాఖపట్నం పోర్టును భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానించే బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.


More Telugu News