గిగ్ వర్కర్లు మనుషులు.. డేటా పాయింట్లు కాదు: ఎంపీ రాఘవ్ చద్దా

  • గిగ్ వర్కర్లను మనుషులుగా చూడాల‌న్న‌ ఆప్ ఎంపీ 
  • దేశవ్యాప్త గిగ్ వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన రాఘవ్ చద్దా
  • కంపెనీలు కార్మికుల శ్రమ వల్లే ఎదిగాయని వ్యాఖ్య
  • 10 నిమిషాల డెలివరీ విధానం కార్మికులను హింసించడమేనని విమర్శ
గిగ్ వర్కర్లను కేవలం పక్కన పడేసే డేటా పాయింట్లుగా కాకుండా మనుషులుగా చూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మెకు ఆయన శుక్రవారం తన పూర్తి మద్దతు ప్రకటించారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి సంస్థల డెలివరీ రైడర్లతో తాను సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సరైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. వేలాది మంది డెలివరీ పార్ట్‌నర్లు తమ యాప్‌లను లాగ్ ఆఫ్ చేయడంతో న్యూ ఇయర్ వంటి రద్దీ రోజున పలు నగరాల్లో డెలివరీలు ఆలస్యమయ్యాయి.

ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. "ఈ ప్లాట్‌ఫామ్‌లు కేవలం అల్గారిథమ్‌ల వల్ల విజయవంతం కాలేదు. కార్మికుల చెమట, శ్రమ వల్లే అవి ఈ స్థాయికి చేరాయి. అలాంటి వారిని గౌరవంగా చూడాలి" అని పేర్కొన్నారు. కంపెనీలను ఉన్నత స్థాయికి చేర్చిన డెలివరీ రైడర్లు, తమ గొంతు వినిపించడం కోసం రోడ్డెక్కడం విచారకరమని అన్నారు.

"గిగ్ ఎకానమీ అనేది అపరాధ భావన లేని దోపిడీ వ్యవస్థగా మారకూడదు. తక్కువ వేతనాలు, ఎక్కువ పనిగంటలు, సామాజిక భద్రత లేకపోవడం వంటివి వారిని వేధిస్తున్నాయి. '10 నిమిషాల డెలివరీ' విధానం కార్మికులపై శారీరక, మానసిక ఒత్తిడిని పెంచుతోంది. వారు రోబోలు కాదు, బానిసలు అంతకన్నా కాదు" అని చద్దా వ్యాఖ్యానించారు.


More Telugu News