Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ దేశద్రోహి అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యజమాని షారుఖ్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ జట్టు కొనుగోలు చేయడంపై ఆయన మండిపడ్డారు. పొరుగు దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్న తరుణంలో ఆ దేశ ఆటగాడిని జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుబడుతూ షారుఖ్‌ను "దేశద్రోహి" అని సంబోధించారు.

మీరట్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో సంగీత్ సోమ్ మాట్లాడుతూ.. "ఒకపక్క బంగ్లాదేశ్‌లో హిందువులను చంపుతున్నారు.. మరోపక్క ఐపీఎల్‌లో అక్కడి క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ రూ. 9 కోట్లు వెచ్చించి బంగ్లాదేశ్ బౌలర్‌ను కొన్నారు. ఇలాంటి దేశద్రోహులకు భారత్‌లో ఉండే హక్కు లేదు" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ప్రజల వల్లే ఈ స్థాయికి ఎదిగిన షారుఖ్, ఇప్పుడు దేశానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఐపీఎల్ కోసం భారత్ వచ్చే బంగ్లా ఆటగాళ్లు విమానాశ్రయం దాటి బయటకు రాలేరని కూడా ఆయన హెచ్చరించారు.

ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్ కూడా కేకేఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులను సజీవ దహనం చేస్తుంటే, అక్కడి అమ్మాయిలపై దాడులు జరుగుతుంటే.. ఆ దేశ ఆటగాళ్లను ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. ముస్తాఫిజుర్‌ను జట్టులో ఆడించవద్దని ఆయన కేకేఆర్ యాజమాన్యానికి సూచించారు.

మరోవైపు కాంగ్రెస్ నేత సురేందర్ రాజ్‌పుత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. షారుఖ్ ఖాన్ ముస్లిం అయినందువల్లే బీజేపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని ఆయన ద్రోహుల పార్టీగా అభివర్ణించారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని అల్లరిమూకలు సజీవ దహనం చేసిన ఘటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే తాజా వివాదం రాజుకుంది.
Shah Rukh Khan
Sangeet Som
KKR
Mustafizur Rahman
IPL
Bangladesh Hindus
Indian Premier League
Devakinandan Thakur
Surender Rajput

More Telugu News