ఈడీ సోదాలు.. ఢిల్లీలో రూ.5 కోట్ల నగదు, రూ.8 కోట్ల ఆభరణాలు స్వాధీనం

  • మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హర్యానాకు చెందిన ఇంద్రజిత్ సింగ్ యాదవ్ 
  • ప్రస్తుతం పరారీలో ఉన్న ఇంద్రజిత్ సింగ్ యాదవ్
  • సన్నిహితుడి నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ
  • నగదు, ఆభరణాలు, రూ.35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం
మనీలాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీలోని ఓ నివాసంలో ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో సుమారు రూ.5 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, అలాగే రూ.35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక సూట్‌కేసులోనే రూ.8.80 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను గుర్తించారు.

హర్యానాకు చెందిన ఇంద్రజిత్ సింగ్ యాదవ్ పలు మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడు. యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అతని సన్నిహితుడు అమన్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించగా, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఇంద్రజిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వెల్లడించారు. దోపిడీ, ఫైనాన్షియర్ల కోసం సెటిల్‌మెంట్లు, బెదిరింపు చర్యలకు సంబంధించి హర్యానా, ఉత్తర ప్రదేశ్ పోలీసులు అతనిపై 14కు పైగా ఎఫ్ఐఆర్‌లు, ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారని తెలిపారు.


More Telugu News