Chandrababu Naidu: 2026లో రెట్టింపు అభివృద్ధికి హామీ... ప్రజలకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2025 సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలనలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని, రాబోయే ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

2025 సంవత్సరం పనితీరును సమీక్షిస్తూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు, నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు" అని ఆయన అభివర్ణించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి డబుల్ డిజిట్ వృద్ధి సాధించామని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం పునరుద్ధరించామని తెలిపారు. 

గూగుల్ వంటి భారీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, క్వాంటం టెక్నాలజీకి పునాదులు వేశామని పేర్కొన్నారు. అదేవిధంగా 'మొంథా' తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొని ప్రజలకు సకాలంలో సహాయం అందించినట్లు గుర్తుచేశారు.

ఈ విజయాల వెనుక నిబద్ధతతో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారని ప్రశంసించారు. అయితే, వీటన్నింటికన్నా ప్రజలు తమపై ఉంచిన నమ్మకం, సహకారమే ఈ ప్రగతికి అసలైన చోదక శక్తి అని చంద్రబాబు అన్నారు. 2026లో పాలనలో వేగాన్ని పెంచి "హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ" లక్ష్యాన్ని చేరుకోవడంలో మరిన్ని అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తితో నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటూ, ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
2026 New Year
Andhra Pradesh Development
Double Digit Growth
Investment
Montha Cyclone
AP Economy

More Telugu News