అరుదైన రికార్డు దిశగా కింగ్ కోహ్లీ

  • వన్డేల్లో 28 వేల పరుగులకు 25 పరుగుల దూరంలో కోహ్లీ
  • న్యూజిలాండ్‌తో జనవరి 11న జరగనున్న తొలి వన్డే
  • ఇప్పటి వరకు 28 వేల పరుగులు సాధించింది సచిన్, సంగక్కర మాత్రమే

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పుడు దగ్గర్లోనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కింగ్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు కేవలం 25 పరుగులే మిగిలి ఉన్నాయి. ఈ ఘనతను అతడు న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


టీ20, టెస్ట్ ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టాడు. జనవరి 11న న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగనుండటం విశేషం. ఈ మ్యాచ్‌లోనే చరిత్ర తిరగరాయబడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం కోహ్లీ 623 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు సాధించాడు. మరో 25 పరుగులు చేస్తే, 28,000 పరుగుల క్లబ్‌లోకి అడుగుపెట్టే మూడో బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే ఉన్నారు. అంతేకాదు, సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే, కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్టే.


వన్డేల్లో పరుగుల వర్షం కురిపించిన కోహ్లీ, 53 శతకాలు, 76 అర్ధశతకాలతో ఇప్పటికే లెజెండ్ స్థాయికి చేరుకున్నాడు. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఆయన, టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినా... అభిమానుల మనసుల్లో మాత్రం ఇప్పటికీ నంబర్ వన్ హీరోగానే నిలిచాడు.


ఈ జాబితాలో ఉన్నవారు:
సచిన్ టెండూల్కర్ – 782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు
కుమార సంగక్కర – 666 ఇన్నింగ్స్‌ల్లో 28,016 పరుగులు
విరాట్ కోహ్లీ- ప్రస్తుతం 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు 

ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌తో మరో చారిత్రాత్మక ఘట్టం రాబోతోందన్న అంచనాతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చే ఒక్క ఇన్నింగ్స్‌ చాలు... భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం రాయడానికి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.



More Telugu News