రూ.600 కోట్లకు అల్లు అర్జున్–అట్లీ సినిమా డిజిటల్ రైట్స్?
- బన్నీ, అట్లీ సినిమాపై భారీ అంచనాలు
- రూ. 1,000 కోట్లతో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్
- సినిమాలో మెరవనున్న దీపిక, మృణాల్, రష్మిక, జాన్వీ
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో కొత్త చిత్రం (AA22 x A6) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ తదితర స్టార్ హీరోయిన్లు మెరవనున్నారని సమాచారం. అట్లీ, హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను ఉపయోగించి అత్యాధునిక వీఎఫ్ఎక్స్ హంగులతో ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నాడు. 2027 వేసవిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్టు సమాచారం. నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కోసం ఈ చిత్రానికి ఏకంగా రూ. 600 కోట్ల ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇది అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ కోసం పొందిన రూ. 275 కోట్ల రికార్డును రెట్టింపు కంటే ఎక్కువగా అధిగమించడం విశేషం. అదే జరిగితే... దాదాపు రూ. 1,000 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక ఓటీటీ రేట్ సాధించిన సినిమా అవ్వనుంది.
ఈ భారీ డీల్ వార్త సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు కారణమవుతోంది. అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “ఇది మా హీరో రేంజ్” అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.