Chandrababu Naidu: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 'రెవెన్యూ క్లినిక్‌'లు.. భూ సమస్యలపై ఇక రాతపూర్వక హామీ!

AP to Implement Revenue Clinics for Land Issue Resolution
  • రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • అర్జీదారులకు రసీదుతో పాటు రాతపూర్వక కార్యాచరణ పత్రం జారీ
  • పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతమైన మోడల్‌ 
  • గడువు, బాధ్యుల వివరాలతో డిప్యూటీ కలెక్టర్ సంతకంతో హామీ పత్రం
  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు ఆపడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలనిచ్చిన 'రెవెన్యూ క్లినిక్' విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కొత్త విధానం ప్రకారం, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో 'ప్రత్యేక రెవెన్యూ డెస్క్' (రెవెన్యూ క్లినిక్) ఏర్పాటు చేస్తారు. ఇకపై భూ సమస్యలపై అర్జీ ఇవ్వడానికి వచ్చే పౌరులకు కేవలం రసీదు మాత్రమే కాకుండా, వారి సమస్యను ఎవరు, ఎప్పటిలోగా పరిష్కరిస్తారో స్పష్టంగా పేర్కొంటూ ఒక 'సర్టిఫైడ్ యాక్షన్ ప్లాన్' (కార్యాచరణ పత్రం) అందిస్తారు. ఈ పత్రంపై డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి సంతకం ఉంటుంది. దీంతో తమ పని పురోగతి గురించి తెలుసుకునేందుకు ప్రజలు పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తమ జిల్లాలో అమలు చేస్తున్న 'రెవెన్యూ క్లినిక్' విధానం విజయవంతమైన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విధానం ద్వారా అర్జీల పునరావృతం తగ్గడం, ప్రజల్లో నమ్మకం పెరగడం గమనించిన సీఎం చంద్రబాబు, దీనిని తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీసీఎల్‌ఏను ఆదేశించారు. ఈ నిర్ణయంపై కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. "జిల్లాలో మేం ప్రవేశపెట్టిన విధానాన్ని ప్రభుత్వం గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా వినియోగిస్తున్నారు. అర్జీ నమోదు చేసిన వెంటనే, సమస్య పరిష్కారానికి పట్టే సమయం, బాధ్యతగల అధికారి వివరాలతో యాక్షన్ ప్లాన్ జనరేట్ అవుతుంది. అంతేకాకుండా, గడువు ముగిశాక ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా అర్జీదారునికి ఆటోమేటెడ్ కాల్ వెళ్లి, సమస్య పరిష్కారమైందో లేదో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఈ నూతన విధానంతో రెవెన్యూ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Chandrababu Naidu
Andhra Pradesh
AP Revenue Clinics
Land Issues AP
Revenue Department AP
Parvathipuram Manyam District
N Prabhakar Reddy
G Jayalakshmi
Land Administration
Revenue Services

More Telugu News