మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ కేసులో డ్రైవర్ ట్విస్ట్... బాత్రూం నుంచే అలర్ట్ చేశారా?

  • డీటీసీ కిషన్ కేసులో బినామీగా డ్రైవర్
  • బాత్రూం నుంచే బంధువులను అప్రమత్తం చేశారని అనుమానం
  • మొబైల్ డేటా రికవరీకి ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచన
  • కిషన్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేయనున్న ఏసీబీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) కిషన్ కేసు దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ అధికారులు కీలక విషయాలు రాబట్టారు. కిషన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ, అతడి ఆర్థిక లావాదేవీలన్నీ చక్కబెట్టిన వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదని, కేవలం అతడి ప్రైవేట్ డ్రైవర్ అని తేలింది. కిషన్‌కు ఇతను బినామీగా వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.

అల్వాల్‌ హిల్స్‌లో కిషన్ బంధువు పేరిట ఉన్న G+1 భవనంపై దృష్టి సారించిన ఏసీబీ, ఆ వ్యక్తి కిషన్‌కు నెలకు రూ.20 వేల జీతానికి పనిచేసే డ్రైవర్ అని గుర్తించింది. అతడి పేరిట లక్షల విలువైన భవనం ఉండటంతో అధికారులు అతడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సోదాల కోసం ఉదయం కిషన్ ఇంటికి వెళ్లినప్పుడు, అతను కొంతసేపు బాత్రూంలోనే ఉండిపోయాడు. ఆ సమయంలోనే తన బినామీ డ్రైవర్‌తో పాటు ఇతర బంధువులను ఫోన్ ద్వారా అప్రమత్తం చేసి ఉంటారని ఏసీబీ భావిస్తోంది.

కిషన్ తన సెల్‌ఫోన్‌లోని డేటాను తొలగించడంతో దాన్ని రిక‌వ‌రీ చేసేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు (FSL) పంపాలని అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా, కిషన్‌ను కస్టడీకి కోరుతూ ఏసీబీ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. కస్టడీ విచారణలో బ్యాంకు లాకర్లు, ఇతర ఆస్తుల గుట్టు వీడుతుందని భావిస్తున్నారు.

1994లో ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరిన కిషన్, అక్రమ మార్గాల్లో రూ.7.6 కోట్ల అదనపు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం కిషన్ చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.  


More Telugu News