ఆరావ‌ళి మైనింగ్‌పై వెన‌క్కి త‌గ్గిన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

  • ఆరావళి పర్వతాల్లో కొత్త మైనింగ్ లీజులపై పూర్తి నిషేధం విధించిన కేంద్రం
  • రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు
  • ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించిన పర్వతశ్రేణికి వర్తింపు
  • సుస్థిర మైనింగ్ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపకల్పనకు ఐసీఎఫ్ఆర్‌ఈకి బాధ్యత
  • ఇప్పటికే ఉన్న గనులపై మరింత కఠిన నిబంధనలు అమలు
ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్వత శ్రేణిలో కొత్తగా ఎలాంటి మైనింగ్ లీజులు మంజూరు చేయవద్దని పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి ప్రాంతానికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) స్పష్టం చేసింది.

అక్రమ, అనియంత్రిత మైనింగ్‌కు అడ్డుకట్ట వేయడంతో పాటు ఈ పర్వతాలను ఒకే భౌగోళిక వ్యవస్థగా పరిరక్షించడమే తమ లక్ష్యమని కేంద్రం పేర్కొంది. ఈ నిషేధాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు గాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)కు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఉన్న నిషేధిత ప్రాంతాలకు అదనంగా, మైనింగ్‌ను శాశ్వతంగా నిషేధించాల్సిన మరిన్ని ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించాలని ఆదేశించింది. అలాగే మొత్తం ఆరావళి ప్రాంతానికి 'సుస్థిర మైనింగ్ యాజమాన్య ప్రణాళిక'ను రూపొందించాలని సూచించింది.

ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనుమతులతో నడుస్తున్న మైనింగ్ కార్యకలాపాలపై మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని, పర్యావరణ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. భూగర్భ జలాలను పరిరక్షించడంలో ఆరావళి పర్వతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది.


More Telugu News