సీఎంకు, టీటీడీ చైర్మన్ కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

  • కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్లు మంజూరు చేసిన టీటీడీ 
  • దీక్ష విరమణ మంటపం, భారీ సత్రం నిర్మాణం చేయనున్నారన్న పవన్ కల్యాణ్
  • మౌలిక సదుపాయాలపై భక్తుల నుంచి వినతులు వచ్చాయని వెల్లడి  
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.35.19 కోట్ల నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీటీడీ ఛైర్మన్ కు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత తన ఇలవేల్పు శ్రీ ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు కొండగట్టు క్షేత్రాన్ని దర్శించుకున్నానని, ఆ సమయంలో దేవస్థానంలో మౌలిక సదుపాయాలపై భక్తుల నుంచి వినతులు అందాయని ఆయన అన్నారు. దీనిపై ఆలయం వద్ద అభివృద్ధి పనుల కోసం తాను టీటీడీకి ప్రతిపాదన పంపగా, ఆ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు టీటీడీ ఆమోదం తెలిపిందని తెలిపారు.

ఈ నిధులతో భక్తుల సౌకర్యార్థం దీక్ష విరమణ మంటపం, 96 గదులతో భారీ సత్రం నిర్మాణం చేపట్టనున్నట్లు పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిధులు మంజూరు చేసిన టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈవోలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


More Telugu News

Pawan Kalyan Kondagattu Anjaneya Swamy Temple TTD Chandrababu Naidu Telangana Temples Temple Development Funds BR Naidu Tirumala Tirupati Devasthanam