స్త్రీ - శక్తి పథకం సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఈయూ రాష్ట్ర నేత పలిశెట్టి

  • కండక్టర్ల, డ్రైవర్ల ఇబ్బందులను యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న పలిశెట్టి
  • చిన్న చిన్న పొరపాట్లకే సస్పెన్షన్లు చేస్తున్నారని ఆవేదన 
  • పరిస్థితులు ఇలానే ఉంటే సిబ్బంది విధుల నిర్వహణ కష్టమన్న పలిశెట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, కండక్టర్లు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తీవ్రమైన పని ఒత్తిడిని ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ పట్టించుకోవడం లేదని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర రావు ఆవేదన వ్యక్తం చేశారు.

విధి నిర్వహణలో జరిగే చిన్నచిన్న పొరపాట్లకే ఆర్టీసీ తనిఖీ అధికారులు కండక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారని, డిపో మేనేజర్లు వాస్తవాలను పరిశీలించకుండానే వాటి ఆధారంగా సస్పెన్షన్లు, తీవ్ర శిక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు విధులు నిర్వహించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు.

ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌టీఆర్ జిల్లా విద్యాధరపురం డిపో యూనియన్ నిర్మాణ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఉమ్మడి జిల్లాల్లోని 15 డివిజన్లలో న్యాయపరమైన కారణాలతో నిలిచిపోయిన పదోన్నతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన ట్రాఫిక్, మెయింటెనెన్స్ ఉద్యోగులతో పాటు ఇతర అన్ని కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.

ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.డి. ప్రసాద్ మాట్లాడుతూ.. స్త్రీ - శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలంటే కనీసం 3వేల అదనపు బస్సులు ప్రవేశపెట్టడంతో పాటు, అన్ని కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీసం పది వేల నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్త బస్సులు, కొత్త నియామకాలు లేకుండా ఇదే సిబ్బందితో పథకాన్ని నడపడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 


More Telugu News