చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ రంగుల అంబులెన్స్ .. మ్యాటర్ ఏమిటంటే..?

  • వైసీపీ మాజీ ఎంపీ సత్యవతి ఫొటోతో ఉన్న వాహనాల వినియోగం
  • అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసిన ఘటన 
  • అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటనలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు, ఆ పార్టీ మాజీ ఎంపీ ఫొటో ఉన్న అంబులెన్స్‌లు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు కశింకోట మండలం తాళ్లపాలెంలోని హెలీప్యాడ్ నుంచి బంగారయ్యపేటలోని సభా ప్రాంగణానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. వాటిపై గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన బి. సత్యవతి ఫొటో, వైసీపీ రంగులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాన్వాయ్‌లో ప్రత్యర్థి పార్టీకి చెందిన గుర్తులు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ విషయంపై వివాదం చెలరేగడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి హైమావతి వివరణ ఇచ్చారు. గతంలో ఎంపీ నిధులతో ఈ అంబులెన్స్‌లను కొనుగోలు చేశారని, అందుకే ఫొటోలు మార్చలేదని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు మొత్తం నాలుగు అంబులెన్స్‌లు అవసరం కాగా, అందుబాటులో ఉన్నవాటిని వినియోగించామని చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో వినియోగించే ముందు కనీసం ఆ ఫొటోలు, రంగులను కనిపించకుండా చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యమేనని విమర్శలు వస్తున్నాయి. 


More Telugu News