గంటా శ్రీనివాసరావు మనవడి ఘనత.. 8 ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డు!

  • గంటా జిష్ణు ఆర్యన్ అరుదైన ఘనత
  • నిమిషంలో 216 గోల్డెన్ రేషియో దశాంశాలు చెప్పి రికార్డు
  • మనవడి ప్రతిభపై గర్వంగా ఉందన్న గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు, 8 ఏళ్ల గంటా జిష్ణు ఆర్యన్‌ తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జిష్ణు ఈ రికార్డు నెలకొల్పాడు.

కేవలం నిమిషం వ్యవధిలో 216 దశాంశాల (డెసిమల్స్‌) స్వర్ణ నిష్పత్తిని (గోల్డెన్‌ రేషియో) అనర్గళంగా చెప్పి జిష్ణు ఆర్యన్ అందరినీ అబ్బురపరిచాడు. ఇంత చిన్న వయసులో క్లిష్టమైన గణిత నిష్పత్తిని గుర్తుంచుకుని చెప్పడం ద్వారా ఈ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జిష్ణు ఆర్యన్‌ తండ్రి రవితేజ, గంటా శ్రీనివాసరావు కుమారుడు కాగా.. తల్లి శరణి, మంత్రి పొంగూరి నారాయణ కుమార్తె. రవితేజ, శరణి దంపతులు ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు తన ఆనందాన్ని పంచుకున్నారు. "నా మనవడు గంటా జిష్ణు ఆర్యన్ 60 సెకన్లలో 216 దశాంశాల గోల్డెన్ రేషియో చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించడం గర్వంగా ఉంది. 8 ఏళ్ల పిన్న వయసులో అంతటి ఏకాగ్రత, గ్రహణశక్తి ప్రదర్శించిన ఆర్యన్‌కు, లక్ష్యం దిశగా ఈ చిన్నారిని నడిపించిన తల్లిదండ్రులు రవితేజ, శరణిలకు అభినందనలు" అని ఆయన తెలిపారు.


More Telugu News