బెంగాల్‌ ర్యాలీలో వర్చువల్‌గా మాట్లాడిన మోదీ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు

  • బెంగాల్ ప్రభుత్వం చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపణ
  • అందుకే రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తోందని విమర్శ
  • మమత పాలనలో బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్‌లోని నాడియాలో జరిగిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పొగమంచు కారణంగా ర్యాలీ ప్రాంతానికి చేరుకోలేకపోయిన ఆయన, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అధికార టీఎంసీ ప్రభుత్వం బెంగాల్‌లో చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని అన్నారు.

మమతా బెనర్జీ పాలనలో బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని మోదీ దుయ్యబట్టారు. ఇటువంటి మహా జంగిల్ రాజ్‌కు తగిన బుద్ధి చెప్పాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.

తృణమూల్ నేతలు, ఆ పార్టీ బీజేపీని ఎంత వ్యతిరేకించినప్పటికీ బెంగాల్ అభివృద్ధిని మాత్రం తాము ఎప్పుడూ ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. మమతా బెనర్జీ పాలనలో ఉద్రిక్తతలు, అల్లర్లు, బెదిరింపులతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితం బెంగాల్ ఎన్నికల్లో తమ విజయానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News

Narendra Modi West Bengal Mamata Banerjee TMC BJP Bengal Politics Corruption Infiltration