గిల్‌ను తప్పించ‌డం వెనుక అస‌లు కార‌ణం... సెల‌క్ట‌ర్లు ఏమ‌న్నారంటే..!

  • టీ20 ప్రపంచకప్ 2026 భారత జట్టు ప్రకటన
  • సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్
  • స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు దక్కని చోటు
  • సరైన కాంబినేషన్ కోసమే గిల్‌ను తప్పించామన్న సెలక్టర్లు
2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్ జట్టులోకి పునరాగమనం చేయగా, రింకూ సింగ్‌కు కూడా చోటు దక్కింది.

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జట్టు వివరాలను వెల్లడించారు. గిల్‌ను తప్పించడంపై అగార్కర్ స్పందిస్తూ, "మేం సరైన కాంబినేషన్ కోసం చూస్తున్నాం. టాప్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. గిల్ ఎంత నాణ్యమైన ఆటగాడో మాకు తెలుసు. కానీ, ఇది కేవలం జట్టు కూర్పులో భాగమే" అని వివరించారు. ఇషాన్ కిషన్ వైట్ బాల్ క్రికెట్‌లో టాప్ ఆర్డర్‌లో ఆడతాడని, మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపారు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. "ఇది గిల్ ఫామ్‌కు సంబంధించిన విషయం కాదు. జట్టు కాంబినేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. టాప్ ఆర్డర్‌లో కీపర్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో రింకూ లాంటి ఆటగాడు ఉండాలని భావించాం" అని అన్నారు. జట్టు ఎంపిక పట్ల తాను సంతోషంగా ఉన్నానని, చాలా సమతూకంగా ఉందని తెలిపారు.

ఈసారి జట్టుకు స్టాండ్‌బై ఆటగాళ్లను ప్రకటించలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. టోర్నమెంట్ స్వదేశంలోనే జరుగుతున్నందున అవసరమైతే మార్పులు చేసే వెసులుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం భారత జట్టు ఇదే:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.


More Telugu News