జానీ మాస్టర్ కేసులో మరో మలుపు.. ఆయన భార్య సుమలతపై బాధితురాలి ఆరోపణలు!

  • డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై బాధితురాలి ఆరోపణలు
  • జానీ మాస్టర్‌ను రక్షించేందుకు సుమలత ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బాధితురాలు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన అమ్మాయి... టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య వి.వి. సుమలతా దేవిపై సంచలన ఆరోపణలు చేసింది. నిందితుడైన జానీ మాస్టర్‌ను సుమలత కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంది. పోక్సో చట్టం కింద నిందితుడిగా ఉన్న వ్యక్తిని రక్షించడం కోసం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సుమలత ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది. తన భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, “నా పని ప్రదేశంలో నేను సురక్షితంగా ఉన్నానా? ఒక నేరస్థుడిని కాపాడటానికి నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవసరమా?” అంటూ నిలదీసింది.

ఇందుకు సంబంధించిన వీడియోలు, స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఈ కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. 


More Telugu News