తెలంగాణలో సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు..

  • టెస్కాబ్, డీసీసీబీలకు ఇన్‌చార్జిలుగా ప్రభుత్వ అధికారులు
  • పాత కమిటీల కొనసాగింపు ఉత్తర్వులను రద్దు చేసిన సర్కార్
  • కొత్త జిల్లాలు, మండలాల వారీగా పునర్వ్యవస్థీకరణకు కసరత్తు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు (టెస్కాబ్), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గాలను తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రద్దయిన పాలకవర్గాల స్థానంలో ప్రభుత్వ అధికారులను ఇన్ఛార్జిలుగా నియమిస్తూ సహకార శాఖ ఆదేశాలు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని 9 డీసీసీబీలు, 904 పీఏసీఎస్‌లు, టెస్కాబ్ పాలక మండళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. దీంతో అప్పటి పాలకవర్గాలనే ‘పర్సన్ ఇన్ఛార్జి మేనేజింగ్ కమిటీలు’గా కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఆరు నెలల పాటు గడువు పొడిగించింది. ఆ తర్వాత ఆగస్టు 14న ఆ గడువును నిరవధికంగా పొడిగిస్తూ మరో జీవో జారీ చేసింది.

తాజాగా, ఆ జీవోను రద్దు చేస్తూ ఈ సంస్థలన్నింటికీ అధికారులను ఇన్ఛార్జిలుగా నియమించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీసీసీబీలను, కొత్త మండలాల ప్రకారం పీఏసీఎస్‌లను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యాకే కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 


More Telugu News

Telangana Government Telangana Cooperative Societies TESCAB DCCB PACS Cooperative Banks Government Orders Person incharge Managing Committees Elections