మహిళా షూటర్‌పై అత్యాచారం.. స్నేహితురాలు సహా ముగ్గురి అరెస్ట్

  • హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘటన
  • పోటీల అనంతరం హోటల్‌లో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఘటన
  • జ్యుడీషియల్ కస్టడీకి నిందితుల తరలింపు
ఫరీదాబాద్‌లో 23 ఏళ్ల మహిళా షూటర్‌పై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి స్నేహితురాలు సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గురువారం పోలీసులు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ షూటింగ్ పోటీలో పాల్గొనేందుకు మంగళవారం తన స్నేహితురాలితో కలిసి ఫరీదాబాద్ వచ్చింది. బుధవారం సాయంత్రం పోటీ ముగిసిన తర్వాత తనను మెట్రో స్టేషన్‌లో దింపమని బాధితురాలి స్నేహితురాలు ఫరీదాబాద్‌లోనే నివసించే గౌరవ్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. గౌరవ్ తన స్నేహితుడు సత్యేంద్రతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత నలుగురూ ఫరీదాబాద్‌లోనే రాత్రికి బస చేసి, మరుసటి రోజు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దీంతో ఓ హోటల్‌లో రెండు గదులు బుక్ చేసుకుని, ఒకే గదిలో పార్టీ చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో, బాధితురాలి స్నేహితురాలు, గౌరవ్ కొన్ని వస్తువులు తీసుకురావడానికి కిందకు వెళ్లారు. అదే సమయంలో గదిలో ఉన్న సత్యేంద్ర తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

వారు తిరిగి వచ్చిన వెంటనే, బాధితురాలు ఈ విషయాన్ని మరో పరిచయస్తుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అనంతరం నిందితుడిని గదిలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న సరాయ్ ఖవాజా పోలీసులు.. సత్యేంద్ర, గౌరవ్, బాధితురాలి స్నేహితురాలిని అరెస్ట్ చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్ కుమార్ తెలిపారు.


More Telugu News