సిరిసిల్ల నియోజకవర్గం ఫలితాలు.. స్పందించిన కేటీఆర్

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన సత్తా చాటిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 117 గ్రామ పంచాయతీలకు గాను 80కి పైగా సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని వెల్లడించారు. 

సిరిసిల్ల నియోజకవర్గం ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. గత రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో ఈ ఫలితాలు మరోసారి తెలియజేశాయని ఆయన అన్నారు. ఉద్యమ పార్టీగా ఉన్నా, అధికార పార్టీగా ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సిరిసిల్ల ప్రజలు గులాబీ జెండానే గుండెల్లో పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా, బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టి ప్రజలు బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి 80 స్థానాల్లో గెలిపించిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.


More Telugu News