బీజేపీ కుట్రలకు నిరసనగా లక్ష మందితో సభ: జగ్గారెడ్డి
- ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రంపై జగ్గారెడ్డి ఆగ్రహం
- గాంధీ, నెహ్రూల పేర్లు లేకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణ
- రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా
- అప్పుడు బీజేపీ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్న
మోదీ, అమిత్ షాలు పుట్టకముందే, 1930లోనే గాంధీజీ 'రఘుపతి రాఘవ రాజారాం' అంటూ సత్యాగ్రహం చేశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ప్రజలను ఏకం చేయడానికి గాంధీ రాముడి పేరు వాడితే, బీజేపీ మాత్రం అదే పేరుతో ప్రజలను విభజిస్తోందని విమర్శించారు. "గాంధీ, నెహ్రూ మీలా క్రిమినల్స్ కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారు. అలాంటి వారిపై ఇప్పుడు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వ కుట్రలకు నిరసనగా త్వరలో సంగారెడ్డిలో లక్ష మందితో భారీ నిరసన సభ నిర్వహిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. మోదీ పాలనలో పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, రైతులు, యువతను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారని, అప్పుడు బీజేపీ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అయ్యాక ఈడీ, సీబీఐ వంటి సంస్థలు మీ మాట వింటాయా? అని నిలదీశారు. అధికారం శాశ్వతం కాదని, బీజేపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.