రేవంత్ రెడ్డి మామ రూ. 23.50 లక్షల క్లెయిమ్ ను తిరస్కరించిన ఇన్స్యూరెన్స్ కంపెనీ

  • సీఎం రేవంత్ మామకు వైద్య బీమా నిరాకరణ
  • నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు
  • గతంలోనూ ఉన్నతాధికారులు కమిషన్‌లను ఆశ్రయించిన వైనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామగారికే ఓ ప్రముఖ బీమా సంస్థ షాకిచ్చింది. ఆయన చేసుకున్న వైద్య బీమా క్లెయిమ్‌ను తిరస్కరించడంతో, ఆయన న్యాయపోరాటానికి దిగారు. సీఎం మామ సూదిని పద్మారెడ్డి, నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీపై హైదరాబాద్‌లోని రెండో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్ ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో నివసించే పద్మారెడ్డి గత ఐదేళ్లుగా నివా బూపా నుంచి రూ.20 లక్షల పాలసీని తీసుకుని క్రమం తప్పకుండా రెన్యూవల్ చేయించుకుంటున్నారు. ఈ ఏడాది మే 13న గుండెనొప్పితో ఆయన మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు అయిన రూ.23.50 లక్షల బిల్లును చెల్లించి, అనంతరం బీమా కోసం క్లెయిమ్ చేశారు.

అయితే, పద్మారెడ్డికి మూడేళ్ల వయసు నుంచే పోస్ట్ పోలియో పెరాలసిస్ ఉందని, ఆ కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. పాలసీ జారీ చేసేటప్పుడు లేవనెత్తని అభ్యంతరాన్ని, ఇప్పుడు క్లెయిమ్ సమయంలో ప్రస్తావించడాన్ని పద్మారెడ్డి తన ఫిర్యాదులో తప్పుబట్టారు.  

గతంలో తెలంగాణ మాజీ సీఎస్ శాంతి కుమారి, మాజీ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ వంటి ఉన్నతాధికారులు కూడా వివిధ అంశాలపై వినియోగదారుల కమిషన్లను ఆశ్రయించారు. బీమా కంపెనీలు చిన్నచిన్న కారణాలతో క్లెయిమ్‌లను తిరస్కరించడం, తీర్పులు వచ్చినా అప్పీళ్లతో కాలయాపన చేయడం సర్వసాధారణంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


More Telugu News