మా ఆదివాసీ దేవుళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదు: మంత్రి సీతక్క హెచ్చరిక

  • రెండు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్న మంత్రి
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందన్న సీతక్క
  • పూర్తిస్థాయి నిధులు గ్రామాలకు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడి
మా ఆదివాసీ దేవుళ్ల జోలికి వచ్చినా, మా అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వాటిని తాము సహించేది లేదని స్పష్టం చేశారు. ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో రెండు విడతల్లో ఇప్పటి వరకు 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని ఆమె అన్నారు. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. 

పదేళ్లు అధికారంలో ఉండి పది ఇళ్లయినా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో కొన్ని వేల ఇళ్లను ఇచ్చిందని అన్నారు. మహిళలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పేద పిల్లలకు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు వస్తే కొందరికి కళ్లమంటగా మారిందని విమర్శించారు. కొంతమంది నీచమైన రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News