మెస్సీ కార్యక్రమంలో గందరగోళం... బెంగాల్ మంత్రి రాజీనామా

  • రాజీనామా చేసిన క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్
  • నిష్పక్షపాత దర్యాప్తు కోసం రాజీనామా చేసినట్లు వెల్లడి
  • మమతా బెనర్జీకి చేతితో రాసిన లేఖను పంపిన బిశ్వాస్
కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ కార్యక్రమం సందర్భంగా జరిగిన గందరగోళ సంఘటనలపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించడంతో పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ సంఘటనకు సంబంధించి విమర్శలను ఎదుర్కొన్న ఆయన, స్వేచ్ఛాయుత మరియు న్యాయమైన దర్యాప్తు జరగడం కోసం తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అందజేసినట్లు తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం కోసం తాను రాజీనామా చేస్తున్నానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేతితో రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయ అనుచరులలో ఒకరు అరూప్ బిశ్వాస్. తృణమూల్ కాంగ్రెస్‌లో శక్తివంతమైన నాయకుడు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతోంది.

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన వేళ కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మెస్సీ 20 నిమిషాల్లోనే అక్కడి నుండి వెళ్లిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులు స్టేడియంలో కుర్చీలు ధ్వంసం చేసి, గుడ్లు విసిరి గందరగోళం సృష్టించారు. ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సమయంలో రాజీనామా వంటి కీలక పరిణామం చోటు చేసుకుంది.


More Telugu News