దర్శకుడు కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది: పవన్ కల్యాణ్

తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ నాదగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు సోనార్ష్ (4) లిఫ్ట్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను ఎంతో మనస్తాపానికి గురిచేసిందని తెలిపారు.

ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "దర్శకుడు కీర్తన్, సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు సోనార్ష్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించాడన్న వార్త తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆ దంపతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

పుత్రశోకం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో తెలిపారు. ఈ కష్టకాలంలో కీర్తన్ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు.


More Telugu News