ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ధురంధర్-2లో ఉంటుంది: మాధవన్

  • రూ. 550 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళుతున్న 'ధురంధర్‌'
  • ఇది ట్రైలర్ మాత్రమేనంటూ సీక్వెల్‌పై హింట్ ఇచ్చిన మాధవన్
  • వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్‌ 2’ విడుదల
  • 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డ్
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న వేళ, ఈ సినిమాలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా నటించిన మాధవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ధురంధర్‌’ను కేవలం ట్రైలర్‌గా అభివర్ణించిన మ్యాడీ, అసలు సినిమా ‘ధురంధర్‌ 2’లో ఉంటుందని తెలిపారు. సీక్వెల్‌లో రణ్‌వీర్‌ నటన మరో స్థాయిలో ఉంటుందని, తన పాత్రకు కూడా ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పి అంచనాలు పెంచారు. ‘ధురంధర్‌ 2’ చిత్రాన్ని 2026 మార్చి 19న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబరు 5న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 552 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ భారీ విజయంపై హీరో రణ్‌వీర్‌ సింగ్‌ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం" అని వ్యాఖ్యానించారు. తన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ, పటిష్టమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు అక్షయ్‌ ఖన్నా నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌ వంటి ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు.

ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ‘ధురంధర్‌’ నాలుగో స్థానంలో ఉంది. 


More Telugu News