37 ఏళ్ల తర్వాత చిక్కిన యాసిడ్ దాడి దోషి.. బాబాగా మారువేషం!

  • 1986 నాటి యాసిడ్ దాడి కేసులో దోషి 37 ఏళ్ల తర్వాత అరెస్ట్
  • జీవిత ఖైదు నుంచి తప్పించుకునేందుకు బాబాగా మారువేషం
  • మధ్యప్రదేశ్‌లోని ఓ ఆశ్రమంలో ఉండగా పట్టుకున్న యూపీ పోలీసులు
  • ఆస్తి వివాదం నేపథ్యంలో ఇద్దరిపై యాసిడ్‌తో దాడి చేసిన నిందితుడు
  • నకిలీ ఐడీలతో దొరికిన వ్యక్తిని కొడుకు ద్వారా గుర్తించిన అధికారులు
ఉత్తరప్రదేశ్‌లో 37 ఏళ్ల క్రితం జరిగిన యాసిడ్ దాడి కేసులో జీవిత ఖైదు పడిన ఓ దోషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇన్నేళ్లుగా సాధువు (బాబా) వేషంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం 1986 ఆగస్టు 23న షాజహాన్‌పూర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆస్తి వివాదం కారణంగా రాజేశ్ అలియాస్ రాజు అనే వ్యక్తి... గంగాధీన్ మునిమ్, ఓం ప్రకాశ్ రస్తోగి అనే ఇద్దరిపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓం ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. కేసును విచారించిన న్యాయస్థానం, 1988 మే నెలలో రాజేశ్ ను దోషిగా నిర్ధారించి, అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే, హైకోర్టులో అప్పీల్ చేసుకుని బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు ఆ తర్వాత పరారయ్యాడు.

అప్పటి నుంచి దాదాపు 37 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. లఖింపూర్ ఖేరితో పాటు దేశంలోని పలు పుణ్యక్షేత్రాల్లో తన మకాం మార్చుతూ వచ్చాడు. చివరకు మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఒక ఆశ్రమంలో బాబాగా జీవిస్తున్నట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), నిఘా విభాగాలు గుర్తించాయి. పక్కా సమాచారంతో అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నాయి.

అరెస్ట్ సమయంలో అతడి వద్ద వేర్వేరు చిరునామాలతో ఉన్న పలు నకిలీ గుర్తింపు కార్డులు లభించాయి. చివరకు అతడి కుమారుడి ద్వారా నిందితుడు రాజేశ్ అని పోలీసులు నిర్ధారించారు. ఎంతకాలం దాక్కున్నా, ఎన్ని వేషాలు మార్చినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఈ అరెస్ట్ రుజువు చేసిందని పోలీసు అధికారులు తెలిపారు.

Rajesh alias Raju
Acid attack case
Uttar Pradesh
Shahjahanpur
Life imprisonment
Baba
Fake identity
Arrest
Crime
Om Prakash Rastogi

More Telugu News