పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలా?... ముందు ఈ పని పూర్తి చేయండి!

  • ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన
  • పీఎఫ్ సేవలు పొందేందుకు యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భవిష్య నిధి సంస్థ
  • ఆన్‌లైన్‌లో ఆరు సులభమైన స్టెప్స్‌తో యాక్టివేషన్ పూర్తి
ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలకమైన ప్రకటన జారీ చేసింది. పీఎఫ్ ఖాతాకు సంబంధించిన బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, డబ్బు విత్‌డ్రా చేయడం, పాస్‌బుక్ చూసుకోవడం వంటి సేవలను పొందాలంటే ఇకపై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. యూఏఎన్ యాక్టివేట్‌లో లేని చందాదారులకు ఎలాంటి ఆన్‌లైన్ సేవలు అందవని తేల్చి చెప్పింది.

ఈ మేరకు ఈపీఎఫ్ఓ తమ అధికారిక సోషల్ మీడియా 'ఎక్స్' ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది. "ఈపీఎఫ్ సేవలు పొందాలంటే యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి" అని పేర్కొంటూ, చందాదారులు తమ నంబర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఆరు సులభమైన స్టెప్స్‌లో వివరించింది. పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందవచ్చని సూచించింది.

యూఏఎన్ యాక్టివేట్ చేసుకునే విధానం..
  • ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
  • 'Important Links' విభాగంలో కనిపించే 'Activate UAN' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తెరపై కనిపించే పేజీలో యూఏఎన్, ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.
  • ఆ తర్వాత 'Get Authorization Pin'పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది.
  • ఆ ఓటీపీని ఎంటర్ చేసి, 'Submit' బటన్‌ను నొక్కితే మీ యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది.

యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత చందాదారులు epfindia.gov.in వెబ్‌సైట్ ద్వారా అన్ని రకాల ఆన్‌లైన్ సేవలను సులభంగా పొందవచ్చు.


More Telugu News